న్యూస్ లైన్ డెస్క్: బీసీ సమగ్ర కులగణన చేపట్టాలని, రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ జులై 15న సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బీసీ సంఘాలు, బీసీ సంఘాల ఐక్యవేదికలు ప్రకటించాయి. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బీసీ నేతలు రాజారాం యాదవ్ తదితరులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ రాజ్యాంగంలో ఒక వర్గానికి ఇంతే ఇవ్వాలని ఎక్కడా చెప్పలేదని, ఇప్పటికే బీహార్లో 70 శాతం, తమిళనాడులో 70 శా తం రిజర్వేషన్లు ఉన్నట్టు బీసీల లెక్కలు తేల్చారని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రాజారాంయాదవ్ మాట్లాడుతూ ఈ నెల 15న తలపెట్టిన సెక్రటేరియట్ ముట్టడికి బీసీలు అందరు అత్యధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.